రాయ్పూర్: ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కార్యాలయ డిప్యూటీ సెక్రటరీ సౌమ్యా చౌరాసియాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మనీల్యాండరింగ్ కేసులో ఈమెను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. బొగ్గు రవాణాలో అవకతవకలు జరిగాయని, ఇందులో కీలక అధికారుల పాత్ర ఉన్నదని పేర్కొంటూ ఆదాయ పన్ను అధికారులు ఈడీకి లేఖ రాశారు. దీంతో మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు సౌమ్య ఇంటితోపాటు మరికొందరి ఇండ్లలోనూ సోదాలు చేపట్టారు.
లెక్కల్లో చూపని భారీ నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే తాజాగా బొగ్గు రవాణాకు చెందిన ఓ సంస్థలో సోదాలు జరిపిన అధికారులు అనంతరం సౌమ్యను అరెస్టు చేశారు. సీఎం కార్యాలయంలో పనిచేసే అధికారిని అరెస్టు చేయడంతో ఛత్తీస్గఢ్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. సీఎం భూపేశ్ బఘేల్ మాట్లాడుతూ అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ పాత్ర ఉన్నదని ఆరోపించారు.