Gold smuggling case | బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ను ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొచి అధికారులు నోటీసులు జారీ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత స్వప్న సురేశ్ మీడియాతో మాట్లాడుతూ ఈ స్మగ్లింగ్ రాకెట్తో సీఎం, ఆయన భార్య, కుమార్తెతో సహా కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపించారు. అంతకుముందు కోర్టులో సీఆర్పీసీ 164 సెక్షన్ ప్రకారం రహస్యంగా వాంగ్మూలం ఇచ్చారు. న్యాయస్థానంలో ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు సేకరించారు. ఈ 27 పేజీల వాంగ్మూలంతో కూడిన ప్రకటన ప్రాతిపదికన స్వప్న సురేశ్కు ఈడీ నోటీసు జారీ చేసింది.
స్వప్న సురేశ్ ప్రకటనను అధ్యయనం జరిపిన ఈడీ అధికారులు తదుపరి విచారణను చేపట్టాలని ఈడీ కొచి యూనిట్ను ఆదేశించారు. మరో రెండు కేసుల్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్కు స్వప్న సురేశ్ ఇచ్చిన రెండు వాంగ్మూలాలను తమకు అందించేలా ఆదేశాలివ్వాలని ఈడీ జిల్లా కోర్టులో పిటిషన్లు దాఖలుచేసింది.
సీఆర్పీసీలోని 164 సెక్షన్ ప్రకారం మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన స్వప్న సురేశ్.. ఈ బంగారం స్మగ్లింగ్ రాకెట్తో కేరళ సీఎం పినరాయి విజయన్, ఆయన భార్య కమల, కూతురు వీణ, వ్యక్తిగత కార్యదర్శి సీఎం రవీంద్రన్, మాజీ ముఖ్య కార్యదర్శి శివ్ శంకర్, మాజీ కార్యదర్శి (రిటైర్డ్) నళిని నెట్టోలకు సంబంధం ఉందని ఆరోపించారు.