న్యూఢిల్లీ, జూలై 26: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని వచ్చిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పలుసార్లు ఫరూక్ను ప్రశ్నించింది. 2019లో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినప్పటికీ.. 2020 డిసెంబర్లో ఆయనకు చెందిన రూ. 11.86 కోట్ల ఆస్తులను జప్తు చేసినప్పటికీ రెండు నెలల కిందట (మే నెలలో) మళ్లీ ప్రశ్నించింది. తాజాగా చార్జిషీట్ను దాఖలు చేసింది.
నిధులు దారి మళ్లినట్టు కేసు..
జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన నిధులను దారి మళ్లించారని, పలువురి బ్యాంకు అకౌంట్లలోకి బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో క్రికెట్ అసోసియేషన్ ఆఫీసు బేరర్లపై సీబీఐ దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ కూడా మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఫరూక్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నది. అయితే మోదీ ప్రభుత్వం ఈ కేసును అడ్డంపెట్టుకొని రాజకీయ కక్షసాధింపులకు దిగుతున్నదని ఫరూక్ అబ్దుల్లా పలుసార్లు ఆరోపించారు. పదేపదే వేధింపులకు దిగుతున్నదని, ప్రతిపక్షాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని విమర్శించారు.