బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై (Siddaramaiah) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చర్యలు చేపట్టింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఆయనకు భూమిని అమ్మిన దేవరాజుపై సెప్టెంబర్ 27న మైసూరు లోకాయుక్త నమోదు చేసిన కేసును ఈసీ పరిగణనలోకి తీసుకున్నది. ఈ నేపథ్యంలో వారిపై ఈడీ కేసు నమోదుకు ఎన్ఫోర్స్మెంట్ కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్)ను దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్లను ఈసీఐఆర్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితులకు ఈడీ సమన్లు జారీ చేసి ప్రశ్నించడంతోపాటు వారి ఆస్తులను అటాచ్ చేసే అవకాశం ఉంది.
కాగా, సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి ఆమె సోదరుడు బహుమతిగా ఇచ్చిన భూమిని ముడా సంస్థ స్వాధీనం చేసుకున్నది. ఆ భూమికి బదులుగా కోట్ల విలువైన 14 ప్లాట్లను ఆమెకు కేటాయించింది. ఇందులో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు కర్ణాటకలోని ప్రతిపక్షమైన బీజేపీ ఆరోపించింది. దీంతో సీఎం సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు.
మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. అనంతరం లోకాయుక్త పోలీసుల విచారణకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు కూడా గత వారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, బావమరిది, భూమిని అమ్మిన వ్యక్తిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ కూడా సోమవారం కేసు నమోదు చేసింది.