న్యూఢిల్లీ, జనవరి 13: మహాదేవ్ యాప్ తర్వాత 2023 ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఎనిమిది బెట్టింగ్ యాప్లపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ జాబితాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రమోట్ చేసిన ‘ఫెయిర్ ప్లే’ యాప్ ఉన్నది. వయాకామ్18 సంస్థ ఫిర్యాదుపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫెయిర్ ప్లే ఇతర యాప్లు అక్రమంగా ఐపీఎల్ టోర్నమెంట్లను తమ స్ట్రీమింగ్ సైట్లలో బ్రాడ్కాస్ట్ చేశాయని ఎఫ్ఐఆర్ పేర్కొన్నది.
2023 ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ హక్కులు తమ సంస్థకు ఉండగా.. ఫెయిర్ ప్లే, ఇతర యాప్లు అక్రమ స్టాఫ్ట్వేర్ ఉపయోగించి తమ వెబ్సైట్లు, ఇతర వేదికలపై లైవ్ ఇచ్చాయని, జరుగుతున్న మ్యాచ్లపై బెట్టింగ్ను నిర్వహించాయని వెల్లడించింది. ఫెయిర్ ప్లే యాప్ ప్రకటనలను పలువురు నటులు, గాయకులు ప్రమోట్ చేశారని, అదేవిధంగా ప్రమోషన్ కోసం సోషల్ మీడియాతోపాటు రైళ్లు, మెట్రోలు, నగరాల్లో యాడ్స్ వేసిందని పేర్కొన్నది.