న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల పరిమితిని ఆదివారం పునరుద్ధరించింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను 40కు పెంచుకోవచ్చని తెలిపింది. నమోదైన, గుర్తింపు పొందని పార్టీలు స్టార్ క్యాంపెయినర్లగా 20 మందిని ప్రకటించవచ్చని పేర్కొంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను 30కు, గుర్తింపు పొందని పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను 15కు ఈసీ కుదించింది.
అయితే ‘యాక్టివ్, కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తగిన చర్చల తర్వాత స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యపై గరిష్ఠ పరిమితిని పునరుద్ధరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది’ అని తెలిపింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు లేఖ ద్వారా పేర్కొంది.
కాగా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు మిగిలిన దశలు, అస్సాంలోని మజులి స్థానానికి అసెంబ్లీ ఉపఎన్నికలకు అదనపు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికల కమిషన్ లేదా సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించాలని ఈసీ కోరింది.
మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 14న గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. తాజాగా ఆదివారం పంజాబ్ పోలింగ్ ముగిసింది. అలాగే ఉత్తరప్రదేశ్కు నిర్వహించే ఏడు దశల పోలింగ్లో ఆదివారం నాటికి మూడు దశలు పూర్తయ్యాయి. యూపీలో మరో నాలుగు దశలతోపాటు మణిపూర్లో ఈ నెల 27న పోలింగ్ జరుగాల్సి ఉన్నది.