న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. నామినేషన్లను ఈనెల 29 వరకు స్వీకరిస్తారు. వచ్చిన నామినేషన్లను జూన్ 30న పరిశీలిస్తారు. నామపత్రాల ఉపసంహరణకు జులై 2 వరకు అవకాశం ఇవ్వనున్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తారు. జులై 21న ఫలితాలను విడుదల చేస్తారు. ఎన్నిక ప్రక్రియ జులై 24 నాటికి పూర్తవుతుంది. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది.
కాగా, రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి అధికార పార్టీకి తగిన బలం లేకపోవడంతో.. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో నేడు ఢిల్లీలో సమావేశం జరుగనుంది. ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, జేడీయూ, ఎస్పీ, ఆర్జేడీ, జేఎంఎం తదితర పార్టీల అధినేతలకు ఆమె లేఖ రాశారు. అయితే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని టీఆర్ఎస్, ఆప్ నిర్ణయించాయి.