న్యూఢిల్లీ: ఓటర్ జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియ ద్వారా దేశ జనాభాను ఎన్నికల సంఘం
(ఈసీ) తగ్గిస్తున్నదని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. దీంతో జనాభా పెరుగుదల గురించి ప్రభుత్వం ఆందోళన చెందడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. (Arvind Kejriwal) ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 47 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను ఈసీ తొలగించడంపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశ రాజధానిలోని సుమారు 1.5 కోట్ల మంది ఓటర్లలో 47 లక్షల పేర్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. ‘జనాభా పెరుగుదల గురించి ప్రభుత్వం ఆందోళన చెందకూడదు. ఎందుకంటే ‘సర్’ ప్రక్రియ ద్వారా దేశ జనాభాను 140 కోట్ల నుంచి 50 కోట్లకు ఎన్నికల సంఘం తగ్గించగలదు’ అని ఎక్స్ పోస్ట్లో మండిపడ్డారు.
కాగా, ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశారు. గతంలో నమోదైన మొత్తం 1,45,10,299 మంది ఓటర్లలో 47,56,722 మంది పేర్లు తొలగించారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈ ముసాయిదా జాబితాలో 97,53,577 మంది ఓటర్ల వివరాలు ఉన్నాయి. ఢిల్లీలో జూన్ 30న ప్రారంభమైన ‘సర్’ ప్రక్రియ ఆగస్ట్ 7న ముగిసింది. ఢిల్లీలోని ఓటర్లలో సుమారు 67.18 శాతం మందికి సంబంధించిన వివరాల పత్రాలు సేకరించి డిజిటలైజ్ చేశారు.