ఈవీఎంలు నిబంధనలకు విరుద్ధంగా తరలించారని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వారణాసి అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎన్.కే. సింగ్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు యూపీ ఎన్నికల ప్రధాన అధికారిని ఈసీ ఆదేశించింది. ఇదే విషయంపై వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. నేటి ఉదయానికి ఈవీఎంలు తరలించాల్సి ఉంది. కానీ.. ఈ సస్పెండ్ అయిన అధికారి.. ఎవ్వరికీ చెప్పకుండా రాత్రే ఈవీఎంలను తరలించారు అంటూ పేర్కొన్నారు. ఈవీఎంలను తరలిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారని, అవి ట్రైనింగ్కు సంబంధించినవని, వాటి ఆపి… తరలిస్తున్నారని రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారని జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ శర్మ వివరించారు.
కౌంటింగ్ సెంటర్ల నుంచి ఈవీఎంలను దొంగలిస్తున్నారని అఖిలేశ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే, నిబంధనలను తుంగలో తొక్కి, ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ఈవీఎంలను తరలిస్తున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాలను కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇక.. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, తమకు ఎన్నికల సంఘంపై ఏమాత్రం నమ్మకం లేదని సంచలన ఆరోపణలు చేశారు.
ఇక.. బీజేపీ ఓడిపోయే చోట్ల కౌంటింగ్ను అత్యంత నెమ్మదిగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు కూడా అందాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే క్రమంలో యూపీ ఎన్నికలే చివరి అస్త్రమని, వీటి తర్వాత ఇక.. ఎవరికి సంబంధించిన స్వేచ్ఛ కోసం వారు పోరాడాల్సిందేనని అన్నారు.