న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో మూడు స్థానాలకు ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళలో ఖాళీ అయిన మూడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 31న ఉప ఎన్నికలు జరుగుతాయని సోమవారం తెలిపింది. జూన్ 3న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. ఒడిశాలోని బ్రజరాజ్నగర్, కేరళలోని త్రిక్కకర, ఉత్తరాఖండ్లోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 4న నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేస్తుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 11. 12న స్క్రూటినీ కాగా, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 16. మే 31న మంగళవారం పోలింగ్, జూన్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. జూన్ 5 నాటికి ఉప ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
కాగా, మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఏడాది జనవరి వరకు ప్రచురించిన ఓటర్ లిస్ట్ను పరిగణలోకి తీసుకుంటామని ఈసీ తెలిపింది. అలాగే ఈవీఎంల ద్వారానే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మోడల్ కోడ్ వెంటనే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.
మరోవైపు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చంపావత్ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఇక్కడ గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర గహటోడి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయినా ఆ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో బీజేపీ అధిష్ఠానం మరోసారి సీఎంగా ఆయనకు అవకాశం ఇచ్చింది.