న్యూఢిల్లీ, జనవరి 24: వాతావరణంలో అనూహ్య మార్పులు, పర్యావరణానికి జరుగుతున్న తిరుగులేని నష్టం వల్ల ఉత్పాతాలు అధికమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటి ఫలితంగా ఆరోవిడత సామూహిక జీవవినాశనం దిశగా భూమి పరుగులు పెడుతున్నట్టు పేర్కొంటున్నారు. భూమిమీద జీవవ్యవస్థ తలకిందులు కావచ్చని, మొత్తంగా జీవమే అంతర్ధానం కావచ్చని అంటున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు భూమి మీద మహా వినాశనాలు సంభవించి పలు జంతు జాతులు పూర్తిగా అంతరించిపోయాయి. ఊలు కలిగిన మహాగజాలు, బెత్తెడు కోరల పెద్దపులులు, డోడో పక్షులు, మానవ ఆవిర్బావం కంటే ముందే డైనోసార్లు అంతరించిపోయాయి. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న వాతావరణ విపత్తులు ఆరోవిడత ఘోరకలికి దారితీయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదివరకటి కల్పాంతాలకు, ఈసారి సంభవించబోయే కల్పాంతాలకు తేడా ఏమిటంటే ఇది పూర్తిగా మానవ కల్పితమేనని ఈ అంశంపై అధ్యయనం జరుపుతున్న హవాయీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం నాయకుడు రాబర్ట్ కోవీ అన్నారు. మనిషి మాత్రమే తన చుట్టూరా ఉన్న పర్యావరణాన్ని మార్చగలిగే స్థాయిలో ఉన్నాడని చెప్పారు. ఆరోవిడత కల్పాంతానికి అప్పుడే నాందీప్రస్తావన జరిగిపోయాయని ఆయన చెప్పడం గమనార్హం.
అలా ఎలా అనుకొంటాం?
కోవీ బృందం చేస్తున్న హెచ్చరికలను కొందరు కొట్టిపారేస్తున్నారు. సునామీలు, దావానలాలు, వరదలు, ఇతర ఉత్పాతాలు ప్రపంచంలోని జీవవైవిధ్యాన్ని తీవ్ర సమస్యల ముంగిట్లోకి తీసుకెళ్తున్న మాట నిజమేనని, అంతమాత్రాన కల్పాంతం సమీపిస్తున్నట్టు భావించలేమని వారంటున్నారు.