న్యూఢిల్లీ: భూమికి ఒక కొత్త అంతరిక్ష సహచరుడు దొరికాడు. భూమికి దీనిని రెండో చంద్రుడిగా చెప్తున్నప్పటికీ ఇది నిజమైన చంద్రుడు కాదు. అయినప్పటికీ భూమిలాగే సూర్యుడి చుట్టూ దాదాపు ఒకే కక్ష్యలో పరిభ్రమిస్తున్న అరుదైన గ్రహశకలంగా నాసా గుర్తించింది. దీనికి ‘2025 పీఎన్7’గా పేరు పెట్టింది. యూనివర్సిటీ ఆఫ్ హవాయి గుర్తించిన ఈ గ్రహశకలాన్ని నాసా అధికారికంగా ‘క్వాసీమూన్'(పాక్షిక చంద్రుడు) (Quasi Moon)గా ధ్రువీకరించింది.
ఇది 18 నుంచి 36 మీటర్ల వెడల్పుతో దాదాపు ఒక చిన్న భవనం అంత ఎత్తు ఉంది. అంతరిక్ష ప్రమాణాల ప్రకారం ఇది చిన్నదే అయినప్పటికీ భూమికి పొరుగునే ఉండటం విశేషం. ఇది మన చంద్రుడిలా భూమి గురుత్వాకర్షణ శక్తికి లోను కాలేదు. కాకపోతే ఒకే ట్రాక్పై మనతో పరుగు తీస్తున్న ‘స్నేహపూర్వక రన్నర్’లా ఉందని శాస్త్రవేత్తలు పోల్చారు. సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఇది భూమిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. ‘2025పీఎన్7’ గత 60 సంవత్సరాలుగా భూమితో దాదాపు ఒకే వేగంతో, ఒకే కక్ష్యలో ప్రయాణిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత కక్ష్య స్థిరంగా ఉంటే 2083 వరకు ఇది మనతోనే ఉంటుంది. ఆ తర్వాత ఇది అంతరిక్షంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇది మన భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు 40 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మన చంద్రుడి దూరం కంటే 10 రెట్లు ఎక్కువ. సూర్యుడు, ఇతర గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ఇది 1.7 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించగలదు. క్వాసీ మూన్స్ చాలా అరుదైనవి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కేవలం ఎనిమిదింటిని మాత్రమే గుర్తించారు. ఈ గ్రహశకలాలు గతిశీలతను, అంతరిక్షంలో భూమి గురుత్వాకర్షణ ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి.