చండీఘడ్: హర్యానా సర్కారు అత్యంత ఆర్భాటంగా ఈ-అధిగమ్ స్కీమ్ను ప్రారంభించింది. డిజిటల్ లెర్నింగ్(Digital Learning)లో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత ట్యాబ్లను పంచారు. కానీ ఆ స్కీమ్ విఫలమైనట్లు తెలుస్తోంది. కర్నాల్, కతియాల్ జిల్లాల్లో అనేక ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల నుంచి ఆ ట్యాబ్లెట్లను వెనక్కి తీసుకుంటున్నారు. వైఫై కనెక్టివిటీ , సిమ్ కార్డులు లేకపోవడం, సాంకేతిక సమస్యలు, ఆపరేషనల్ సపోర్ట్ లేకపోవడంతో ట్యాబ్లెట్లను ప్రభుత్వం మళ్లీ తీసేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు డిజిటల్ అంశాల్లో చురుకుగా మారేందుకు ఆ స్కీమ్ను అమలు చేశారు. 2022లో సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ఆ స్కీమ్ను ప్రారంభించారు. ఆ స్కీమ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ట్యాబ్లెట్లను పంపిణీ చేశారు. ప్రీలోడ్ డిజిటల్ కాంటెంట్తో పాటు సిమ్ కార్డులు, డెయిలీ 2 జీబీ డేటా కల్పించారు.
వీడియో క్లాసులు వినేందుకు, డిజిటల్ పుస్తకాలు చదివేందుకు, ఆన్లైన్ అసైన్మెంట్ చేసేందుకు ఆ ట్యాబ్లెట్లను ఇచ్చారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. వైఫై, సిమ్ కార్డులు లేకపోవడం వల్ల విద్యార్థులకు ట్యాబ్లెట్లు ఉపయుక్తంగా లేవన్నారు. కర్నాల్ జిల్లాలో 32 వేల ట్యాబ్లెట్లను పంచారు. దాంట్లో ప్రస్తుతం 23 వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక కథియాల్ జిల్లాలో 27వేల ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. వీటిల్లో కేవలం 20 వేలు మాత్రమే ఫంక్షనల్గా ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల డిజిటల్ ట్యాబ్లెట్లు నిరుపయోగంగా ఉంటున్నట్లు టీచర్లు ఆరోపించారు.