Delhi Pollution | ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడో విడత ఆంక్షలు విధించాలని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ గురువారం ఆదేశించింది. సీఏక్యూఎం సమావేశం అనంతరం రాజధానిలో గ్రాప్-3ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో గాలి నాణ్యత గురువారం అధ్వాన్నంగా తయారైంది. ఢిల్లీతో పాటు నోయిడా, గ్రేటర్ నోయిడా పరిస్థితి ఘోరంగా తయారైంది. గ్రాప్-3 అమలు నేపథ్యంలో అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేత పనులపై నిషేధాజ్ఞలు అమలు రానున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్బుద్ధనగర్లో పెట్రోల్తో నడిచే బీఎస్-3 ఇంజిన్లు, డీజిల్తో నడిచే బీఎస్-4 వాహనాలను ఉపయోగించడంపై బ్యాన్ విధించారు.
బొగ్గుల కుంపటి, కలపతో వంట చేయడం సైతం నిషేధం అమలులోకి వచ్చింది. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పారిశ్రామిక యూనిట్లు, థర్మల్ పవర్ ప్లాంట్లను సైతం పర్యవేక్షించనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు, కలప వాడకంపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు మినహా అన్ని రకాల నిర్మాణ కార్యకలాపాలు మూసివేయనుండగా.. చీపుర్లతో రోడ్లను ఊడవడాన్ని నిలిపివేయగా.. క్రమం తప్పకుండా దుమ్మ లేవకుండా నీరు చల్లాలని ఆదేశాలు ప్యానెల్ సూచించింది. హాట్మిక్స్ ప్లాంట్లు, ఇటుక బట్టీలను నడుపడంపై నిషేధం ఉండగా.. ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు బోధించాలని అడ్వైజరీ జారీ చేసింది.