లక్నో: తప్పతాగిన ఓ వ్యక్తి (Drunk man) గొడ్డలితో ప్రభుత్వ పాఠశాలలో హల్చల్ చేశాడు. గొడ్డలితో (Axe) స్కూల్ ఆవరణలో ఉన్న ఆస్తులను ధ్వంసం చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) బారాబంకి (Barabanki) జిల్లాలో జరిగింది. శివప్రసాద్ అనే వ్యక్తి పూటుగా తాగి ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వచ్చాడు. చేతిలో ఉన్న గొడ్డలితో స్కూల్లో ఉన్న బోరింగ్ పంపు (Hundpump)ను ధ్వంసం చేశాడు. ఉపాధ్యాయులు వారించినా పట్టించుకోని అతడు.. వారికి దాడికి యత్నించాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ఎంతలా అంటే ఘటన జరిగి నేటికి మూడు రోజులైనప్పటికీ సిబ్బందితోపాటు విద్యార్థులు స్కూల్ వంక రాలేదు.
విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లా విద్యాధికారి (DEO) ప్రదీప్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే నిందితుడు పరారీలో ఉండటంతో అతనికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనను కొందరు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.