చండీగఢ్: పంజాబ్ జైళ్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ను నియంత్రించడంపై చర్యలు తీసుకోవడం లేదంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్, డ్రగ్ మాఫియా, జైళ్ల విధానాలపై వారంలోగా రిపోర్ట్ అందజేయాలని హైకోర్టు కోరిందన్నారు. అయితే జైళ్ల శాఖ మంత్రి అయిన సీఎం సీఎం భగవంత్ మాన్ ఏం చేశారని సిద్ధూ ప్రశ్నించారు. ‘జైళ్లలో డ్రగ్ ట్యాబ్లెట్లు అమ్ముతున్నారు. నేను చెప్పింది అబద్ధమని రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని అన్నారు.
మరోవైపు, పంజాబ్లో పెరుగుతున్న అప్పులు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆప్ ప్రభుత్వాన్ని సిద్ధూ విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆ అవసరాలకు వినియోగించడం లేదని, ఈ కారణంగానే పంజాబ్కు అందాల్చిన రూ.8,000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. కేంద్ర పథకంలో 40 శాతం వాటా ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని విమర్శించారు.
కాగా, 1988లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించిన కేసులో సిద్ధూకు సుప్రీంకోర్టు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో ఆయన 10 నెలలు జైలులో ఉన్నారు. అయితే సత్ప్రవర్తన కారణంగా గడువుకు ముందే జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం పంజాబ్ రాజకీయాలపై దృష్టిసారించారు.