న్యూఢిల్లీ, ఆగస్టు 4: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇకపై ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు(ఆర్టీవో) వెళ్లనక్కర్లేదు. అక్కడ డ్రైవింగ్ టెస్టులో పాస్ కానక్కర్లేదు. డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చిన ప్రైవేటు సంస్థలే లైసెన్స్లు కూడా జారీ చేయనున్నాయి. ప్రభుత్వ అధీకృత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల(డీటీసీ) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వాహన తయారీ సంస్థలు, ఎన్జీవోలు, ప్రైవేటు సంస్థలు డీటీసీలను ఏర్పాటు చేసేందుకు, డ్రైవింగ్ లైసెన్స్లను జారీ చేసేందుకు అనుమతినిచ్చింది. శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రైవేటు సంస్థలు ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకొన్న 60 రోజుల్లో వాటికి గుర్తింపు లభిస్తుంది. డీటీసీలను ఏర్పాటు చేసే సంస్థలు, ఎన్జీవోలకు.. కేంద్ర మోటారు వాహనాల చట్టం-1989లో నిర్దేశించిన మేరకు మౌలిక వసతులు, స్థలం ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఆర్టీవోలకు డీటీసీలు అదనం అని కేంద్రం తెలిపింది.