IND vs PAK : ఐక్యరాజ్యసమితి (UNO) వేదికగా పాకిస్థాన్ (Pakistan) పై భారత్ (India) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) పై పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ చర్య ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై జరిగిన స్పష్టమైన దాడి అని, ఇది ఆ దేశంతోపాటు యావత్ ప్రాంతీయ శాంతికి పెను ముప్పు అని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి, అంబాసిడర్ హరీశ్ పర్వతనేని (Harish Parvathaneni) మాట్లాడుతూ.. పాకిస్థాన్ దాడుల్లో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
ఆఫ్ఘనిస్థాన్లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (UNAMA) నివేదికలను ఆయన ఉటంకించారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 372 మంది పౌరులు మరణించారని, మరో 397 మంది గాయపడ్డారని తెలిపారు. వీరిలో అత్యధికులు పవిత్ర రంజాన్ మాసంలో లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో మరణించడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు. ఇదే సమావేశంలో ఐరాస నివేదికల విశ్వసనీయతను పాకిస్థాన్ ప్రశ్నించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘బహుళపక్షవాదం, ఐక్యరాజ్యసమితి పట్ల మద్దతు’ అనేది ఎవరి ఇష్టానుసారం వారు ఎంచుకునే మెనూ కాదని అన్నారు. ఐరాస నివేదికలను మీకు నచ్చినప్పుడు దాన్ని స్వీకరించి, నచ్చనప్పుడు తిరస్కరించడం కుదరదని పర్వతనేని పాకిస్థాన్కు గట్టిగా బదులిచ్చారు.
ఆఫ్ఘనిస్థాన్లో శాంతి, స్థిరత్వం కోసం యూఎన్ఏఎంఏ చేస్తున్న కృషికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. అంతర్జాతీయ చట్టాలను, ముఖ్యంగా అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని, పౌరుల రక్షణను నిర్ధారించాలని ఐరాస సెక్రెటరీ జనరల్ చేసిన పిలుపును భారత్ సమర్థిస్తోందని పర్వతనేని తెలిపారు. ఈ దాడులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి జవాబుదారీతనాన్ని నిర్ధారించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని UNAMA చేసిన డిమాండ్కు భారత్ మద్దతు తెలుపుతోందని ఆయన వివరించారు. ఇలాంటి దారుణమైన హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కావని హితవు చెప్పారు.