డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) మరో ఘనత సాధించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ తొలి విమానం విజయవంతమైంది. దీంతో మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా డీఆర్డీవో గొప్ప విజయం సాధించింది. ఈ తొలి విమానాన్ని డీఆర్డీవో కర్ణాటకలోని చిత్రదుర్గ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఇది మానవ రహిత గగనతల విమానం (యూఏవీ). ఇందుకు సంబంధించిన వివరాలను డీఆర్డీవో శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలో స్వావలంబన దిశగా ఇది ఒక ముఖ్యమైన దశ అని డీఆర్డీవో పేర్కొంది.
ఈ మానవ రహిత గగనతల విమానాన్ని డీఆర్డీవో పరిశోధనా ప్రయోగశాలల్లో ఒకటైన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) రూపొందించింది. ఏడీఈ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ యూఏవీ ఒక చిన్న టర్బోఫ్యాన్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది పూర్తిగా తనంతట తాను పని చేస్తుంది. టేకాఫ్ నుంచి వే పాయింట్ నేవిగేషన్, ల్యాండింగ్ వరకు కచ్చితమైన పనితీరును ప్రదర్శించిందని డీఆర్డీవో తెలిపింది. భవిష్యత్తులో మానవ రహిత విమానాల అభివృద్ధికి ఈ పరీక్ష గొప్ప మైలురాయి లాంటిదని పేర్కొంది.
#DRDOUpdates | Successful Maiden Flight of Autonomous Flying Wing Technology Demonstrator@PMOIndia https://t.co/K2bsCRXaYp https://t.co/brHxaH7wbF pic.twitter.com/SbMnI5tgUM
— DRDO (@DRDO_India) July 1, 2022