రుద్రప్రయాగ్, నవంబర్ 15: శీతాకాలాన్ని పురస్కరించుకుని కేదార్నాథ్ ఆలయ మహాద్వారాన్ని భయ్యా దూజ్ సందర్భంగా బుధవారం మూసివేశారు. శీతాకాలమంతా ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. కాగా, తెల్లవారుజామునే చలిలో వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోగా, పూజారులు శివునికి పూజలు, ఇతర సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 8.30 గంటలకు మహాద్వారాలను మూసివేశారు. శీతాకాలమంతా ఈ ఆలయాన్ని మూసివేసి ఉంచుతామని బద్రినాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్నాథుని పంచముఖి డోలిని పూజారులు భుజంపై మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయంలో భద్రపరిచారు. ఈ శీతాకాలమంతా స్వామివారికి అక్కడే పూజలు నిర్వహిస్తారు. కాగా, ఈ సీజన్లో కేదార్నాథుడిని 19.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు.