రాయ్పూర్: ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మద్యం మత్తులో మహిళా రోగిని కొట్టాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కుమారుడిపై మండిపడ్డాడు. ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. గెర్వానీ గ్రామానికి చెందిన సుఖమతి అనే మహిళ బుధవారం రాత్రి అస్వస్థతకు గురైంది. దీంతో కుమారుడు శ్యామ్ కుమార్ అంబులెన్స్ కోసం 108, 112కు కాల్ చేశాడు. అయితే అంబులెన్స్ వచ్చేందుకు ఆలస్యం అవుతుందని చెప్పారు. మరోవైపు తల్లి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆమెను ఆటోలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
కాగా, రాత్రి వేళ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్ మద్యం సేవించి ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ డాక్టర్ ఆ మహిళా రోగి చెంప, తలపై పలుమార్లు కొట్టాడు. గమనించిన ఆ మహిళ కుమారుడు శ్యామ్ కుమార్ దీనిని నిలదీశాడు. అయితే నిశ్శబ్దంగా ఉండాలంటూ శ్యామ్ కుమార్పై డాక్టర్ అరిచాడు.
మరోవైపు ఆసుపత్రిలోని ఒకరు మొబైల్లో రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. ఆ డాక్టర్కు షాకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి ఆ డాక్టర్పై చర్యలు చేపడతామని మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ తెలిపారు.
Video Shocker: Doctor Thrashes Woman Patient At Chhattisgarh Hospital https://t.co/vmCmitnIsR pic.twitter.com/4LSxDm5p1C
— NDTV (@ndtv) November 10, 2022