భోపాల్: అప్పుల బాధలు తాళలేక డాక్టర్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. (Doctor couple suicide) ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఆ డాక్టర్ దంపతులు వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. అప్పుల బాధ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్లో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బినా పట్టణం నందన్ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ దంపతులు బల్బీర్, మంజు కైథోరియా శనివారం వారి ఇంట్లో శవాలుగా కనిపించారు. మరో టౌన్లో చదువుతున్న వారి కుమారుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బల్బీర్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్కు వేలాడాన్ని గమనించారు. బెడ్పై మరణించి ఉన్న అతడి భార్య మంజు విషం సేవించి లేదా ఇంజెక్షన్ చేసుకుని చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ గదిలో ఉన్న సూసైడ్ లేఖను గుర్తించారు. అప్పుల బాధ వల్ల ఆందోళన చెందిన తాము ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.
మరోవైపు కుర్వాయిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్గా బల్బీర్, బినా ప్రభుత్వ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా మంజు పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. డాక్టర్ దంపతుల ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వారి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.