China Mobiles | సైనికులు చైనా మొబైల్ ఫోన్లు వాడకుండా చర్యలు తీసుకోవాలని రక్షణశాఖ అధికారులకు నిఘా వర్గాలు సూచించాయి. ఇటీవల కొంతకాలంగా భారత్-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నది. దీనిపై ఇరు దేశాల సైన్యాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి కానీ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో చైనా మొబైల్ ఫోన్లు వాడొద్దని రక్షణ శాఖ అధికారులకు నిఘా వర్గాలు సూచించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. చైనా మొబైల్ ఫోన్ల నుంచి మాల్వేర్, స్పైవేర్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నిఘా వర్గాలు రక్షణశాఖను హెచ్చరించాయి. చైనా మొబైల్ ఫోన్లు వాడుతున్న వారు ఇతర ఫోన్లు వాడాలని సైనిక సిబ్బందికి సూచించాయి.
చైనా మొబైల్ ఫోన్ల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సైనిక సిబ్బందిని ఆదేశించాలని రక్షణశాఖ నిఘా వర్గాలు సర్క్యులర్ విడుదల చేశాయి. భారత్తో విభేదిస్తున్న దేశాల్లో తయారైన మొబైల్ ఫోన్లను సైనికులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వాడకుండా జాగ్రత్త వహించాలని ఆ సర్క్యులర్ పేర్కొంది. కొన్ని చైనా మొబైల్ ఫోన్లలో మాల్వేర్, స్పైవేర్లు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
అయితే, చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు తయారు చేసిన పలు మొబైల్ ఫోన్లో దేశీయ మార్కెట్లో లభిస్తున్నాయి. గతంలో పలు చైనా యాప్స్ను కేంద్రం నిషేధించింది. ఆయా ఫోన్లలో సైనికులు వాడుతున్న చైనా యాప్లను రక్షణశాఖ నిఘా వర్గాలు తొలగించాయి. దేశభద్రతకు ముప్పు ఉన్నందునే పలు చైనా యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.