న్యూఢిల్లీ: సమాచార భద్రత, మార్పిడి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు కీలకమైన సమాచారాన్ని, డాక్యుమెంట్లను ఒకరి నుంచి మరొకరికి చేరవేయడానికి వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్లను ఉపయోగించవద్దని సూచించింది. ఇలాంటి యాప్లను విదేశాల్లో ఉండే ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తుంటాయని, కాబట్టి మనం పంపే సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశముందని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగులు సమాచార మార్పిడి కోసం ‘ఈ-ఆఫీస్ అప్లికేషన్స్’ను మాత్రమే ఉపయోగించాలని కోరింది. అలాగే దేశ భద్రత లాంటి కీలకమైన సమావేశాలకు హాజరయ్యే అధికారులు స్మార్ట్ ఫోన్లను, స్మార్ట్ వాచ్లను ఉపయోగించవద్దని సూచించింది.