న్యూఢిల్లీ: మూక దాడులు జరిగినపుడు బాధితుల కుల, మతాలను బట్టి మాట్లాడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మైనారిటీలపై మూక దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మూక దాడుల బాధితుల కుటుంబాలకు తక్షణమే తాత్కాలిక నష్టపరిహారం చెల్లించే విధంగా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
వివిధ రాష్ర్టాల్లో జరిగిన కేసులను పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. ఇవి మూక దాడులు కాదని, కేవలం సాధారణ గొడవలు మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయని తెలిపారు. రాష్ర్టాలు ఈ విధంగా వ్యవహరిస్తే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, మూక దాడుల గురించి ప్రస్తావించేటపుడు, కేవలం నచ్చినవాటి గురించి మాత్రమే మాట్లాడవద్దని సలహా ఇచ్చింది.
రాజస్థాన్లోని టైలర్ కన్నయ్య లాల్ హత్య గురించి ప్రస్తావించింది. ఇటువంటి సందర్భాల్లో కులం, మతం గురించి ప్రస్తావించవద్దని సలహా ఇచ్చింది. బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ పెట్టిన పోస్ట్ను షేర్ చేసిన కన్నయ్య లాల్ను తన టైలరింగ్ షాప్ వద్ద 2022లో కొందరు దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే.
పిటిషనర్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ, ఈ కేసు గురించి తమ పిటిషన్లో ప్రస్తావించలేదన్నారు. ధర్మాసనం ప్రతిస్పందిస్తూ, కేవలం కొన్ని కేసుల గురించి మాత్రమే ప్రస్తావించకూడదని వివరించింది. మూక దాడులపై తీసుకున్న చర్యలను తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు మరో ఆరు వారాల గడువు ఇచ్చింది.