రాంచీ, జనవరి 10: మనీలాండరింగ్ కేసులో ఈడీ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు వరుసగా పలుమార్లు సమన్లు జారీచేయడం.. విచారణకు ఆయన గైర్హాజరు అవుతూ వస్తున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసింది. మందస్తు అనుమతి లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల నోటీసులు, అభ్యర్థనలకు స్పందించొద్దని, డైరెక్ట్గా ఎలాంటి డాక్యుమెంట్లు అందించొద్దని అన్ని శాఖలకు సూచించింది.
ఏవైనా కేసుల్లో దర్యాప్తు సంస్థల ఎంక్వైరీలకు ఎవరూ ప్రత్యక్షంగా స్పందించకూడదని, వాటిని ప్రాసెసింగ్ కోసం క్యాబినెట్ సెక్రటేరియట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్కు తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ మేరకు సీఎం సొరేన్ ప్రధాన కార్యదర్శి వందన దడేల్ మంగళవారం అన్ని ప్రభుత్వ విభాగాలకు లేఖ రాశా రు. అసంపూర్తి, తప్పు సమాచారం అందించడాన్ని నివారించేందుకు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో సరైన సహకారం ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నారు.
దర్యాప్తు సంస్థలకు సహాయ నిరాకరణ!
చాలా సందర్భాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులను సీనియర్ అధికారుల దృష్టికి తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లను కేంద్ర ఏజెన్సీలకు అందించడం జరిగిందని, ఇది తప్పుడు ప్రక్రియ అని వందన తెలిపారు. కొత్త ప్రక్రియ ప్రకారం.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు తగిన సమాచారం అందించడంలో క్యాబినెట్ సెక్రటేరియట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నోటీసులు వస్తే..
డిపార్ట్మెంట్ హెడ్ ఆ సమాచారాన్ని నోడల్ ఏజెన్సీకి పంపిస్తారు. చివరిగా న్యాయపరమైన సలహాలు తీసుకొని, అందుకు అనుగుణంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అడిగిన సమాచారాన్ని అందించడం జరుగుతుంది. దర్యాప్తు సంస్థలకు అసంపూర్తి సమాచారాన్ని అందజేయకుండా ప్రక్రియను క్రమబద్దీకరిస్తున్నట్టు జార్ఖండ్ ప్రభుత్వం చెబుతుండగా.. అయితే ఇది సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహాయ నిరాకరణలో భాగమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈడీ ఇప్పటికి సొరేన్కు ఏడుసార్లు సమన్లు జారీచేసింది.