ధారాపురం: తమిళనాడులో ప్రధాని మోదీ ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధారాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడు మహిళలను డీఎంకే అవమానపరిచినట్లు మోదీ ఆరోపించారు. డీఎంకే కేవలం అబద్దాలను మాత్రమే ప్రచారం చేస్తోందని, తమ పార్టీకి చెందిన కాలంచెల్లిన 2జీ మిస్సైల్ను వాళ్లు ఇటీవల ప్రయోగించారని, రాష్ట్ర మహిళలను వాళ్లు టార్గెట్ చేశారని, తమిళనాడు నారీశక్తిపై దాడి జరుగుతోందని మోదీ ఆరోపించారు. ఇటీవల సీఎం పళనిస్వామి తల్లిపై డీఎంకే రాజా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఉద్దేశంతో రాజాను టార్గెట్ చేస్తూ మోదీ విమర్శలు చేశారు. మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా.. 2జీ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఎన్డీకే కూటమి ఇక్కడ ప్రజల ఆశీస్సులు తీసుకుంటోందని, అన్ని రంగాల అభివృద్ధి మా లక్ష్యమని, ఎంజీఆర్-జయలలిత ఆదర్శాలతో అభివృద్ధి సాధిస్తామని మోదీ అన్నారు. కాంగ్రెస్-డీఎంకే కూటమి కుటుంబ రాజకీయాలు చేస్తోందన్నారు. మహిళలపై ఓ సీనియర్ నేత అనుచిత కామెంట్స్ చేసినా.. డీఎంకే పార్టీ ఆ నేతపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మోదీ అన్నారు. తమిళనాడు ప్రజలు కాంగ్రెస్-డీఎంకే కూటమిని గమనిస్తున్నారని, మహిళలను అవమానిస్తే రాష్ట్ర ప్రజలు అంగీకరించరన్నారు. 1989, మార్చి 25వ తేదీని ఎన్నటికీ మరిచిపోవద్దు అని, తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే నేతలు జయమ్మతో ఎలా ప్రవర్తించారో తెలుస్తోందని, మహిళా సాధికారత కోసం డీఎంకే-కాంగ్రెస్ కూటమి పనిచేయదని మోదీ అన్నారు.