చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే తన మిత్రపక్షానికి కేటాయించిన నమక్కల్ స్థానంలో పోటీ చేసే అభ్యర్థికి (Namakkal candidate) చెందిన పాత వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో పరువు హత్యను సమర్థించిన ఆయన కులపరంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ మార్చింది. కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి (కేఎండీకే)కు డీఎంకే కేటాయించిన నమక్కల్ స్థానం అభ్యర్థిగా సూర్య మూర్తిని ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఆయన కొంగునాడు మున్నేట్ర కజగం (కేఎంకే)లో ఉన్నప్పుడు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తన వర్గమైన గౌండర్ కమ్యూనిటీకి చెందిన మహిళలు కులాంతర వివాహం చేసుకుంటే వారిని చంపుతానని హెచ్చరించారు.
కాగా, సూర్య మూర్తి పదేళ్ల కిందట చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కేఎండీకే పార్టీ స్పందించింది. నమక్కల్ స్థానం అభ్యర్థిని మార్చింది. పార్టీకి చెందిన నమక్కల్ సౌత్ జిల్లా కార్యదర్శి వీఎస్ మాథేశ్వరన్ను ఆ స్థానం నుంచి బరిలోకి దించింది.