న్యూఢిల్లీ: కర్ణాటక (Karnataka) ముఖ్యంత్రి పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు (Siddaramaiah) సీఎం పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు (DK Shivakumar) ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నారు. ఈమేరకు పదవుల పంపకంపై ఇరువురు నేతలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై డీకే శివకుమార్ సోదరడు బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్ (DK Suresh) అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కర్ణాటక భవితవ్యం, పార్టీ భవిష్యత్ దృష్యా పార్టీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పుకొచ్చారు.
నా సోదరుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు. అయితే అది వాస్తవరూపం దాల్చలేదు. ఇది సంతోషం కలిగించే వార్త అని తాను అనుకోవడం లేదని సురేశ్ అన్నారు. ఓ సోదరుడిగా తాను నిరాశకు గురయ్యానని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము దానికి అంగీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు. అధికార పంపిణీ సూత్రానికి సంబంధించిన వివరాలను ఇప్పుడే చెప్పలేనని, ఏఐసీసీ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు. తాము దానికోసం వేచిచూస్తున్నామని వ్యాఖ్యానించారు.
సాయంత్రం 7 గంటలకు సీఎల్పీ మీటింగ్: డీకే
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 7 గంటలకు క్వీన్స్ రోడ్లోని ఇందిరా గాంధీ భవన్లో జరిగే సమావేశానికి హాజరు కావాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నూతన ముఖ్యమంత్రిని పార్టీ అధిష్ఠానం ప్రకటించనుంది. ఈ నెల 20న బెంగళరూలోని కంఠీరవ స్టేడియంలో కొత్త సీఎం ప్రమాణ స్వీకంర చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.