బెంగళూర్ : కర్నాటకలో రాబోయ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తాను దృష్టిసారించలేదని, రాష్ట్రంలో బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం పదవిపై తాను తొందరపడటం లేదని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన అజెండా అని డీకే పేర్కొన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్యను పార్టీ సీఎం అభ్యర్ధగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ప్రతిపాదనకు మరో ఎమ్మెల్యే రాఘవేంద్ర హిత్నల్ మద్దతు పలికారు. ఎమ్మెల్యేల ప్రకటనపై స్పందిస్తూ డీకే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాడి ఆ పార్టీని మట్టికరిపించి కాంగ్రెస్ను అధికారంలోకి తేవడమే పార్టీ నేతలు, కార్యకర్తల ముందున్న కర్తవ్యమని పార్టీ శ్రేణులకు డీకే హితవు పలికారు. మరోవైపు కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ చీఫ్ జీ పరమేశ్వర్ డీకే శివకుమార్కు మద్దతు పలికారు.