బెంగళూర్ : బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య వంటి అంశాలపై ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు భారత్ జోడో యాత్రను చేపట్టిన రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాలినడకన యాత్ర సాగిస్తున్నారు. తమిళనాడులో సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో సాగుతోంది.
ఇక రాహుల్ జోడో యాత్రకు జనసమీకరణపై కర్నాటకలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య వర్గాల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. భారత్ జోడో యాత్రకు ప్రతి నియోజకవర్గం నుంచి 5000 మందిని సమీకరించాలని, ఈ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయడం లేదని మాజీ కేపీసీసీ చీఫ్ ఆర్వీ దేశ్పాండేపై డీకే శివకుమార్ మండిపడ్డారు. రాహుల్ యాత్ర కోసం సరైన ఏర్పాట్లు చేపట్టడంలో సిద్ధరామయ్య వర్గం సరిగ్గా పనిచేయడం లేదని డీకే ఆరోపించారు.