DK Shiva Kumar : కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో డీకే శివకుమార్ (DK Shivakumar),
సిద్ధరామయ్య (Siddaramaih) మధ్య సీఎం పదవి కోసం గత కొంతకాలంగా బయటపడని వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని హవేరీలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం సిద్ధరామయ్య నిలువెత్తు విగ్రహాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉందనే ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
సిద్ధరామయ్య నాయకత్వంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను
విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం విగ్రహావిష్కరణ జరిగింది. పార్టీలో ఐక్యతను, సమష్టి కృషిని ప్రజలకు చాటడమే ఈ కార్యక్రమం లక్ష్యమని డీకే శివకుమార్ స్పష్టంచేశారు. గ్యారంటీ పథకాల అమలులో సిద్ధరామయ్య పోషించిన పాత్రను కొనియాడుతూ.. ఆయన చరిత్రలో ప్రజా నాయకుడిగా నిలిచిపోతారని అన్నారు.
విగ్రహావిష్కరించిన తర్వాత సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం, ఒకరినొకరు గౌరవించడం రాష్ట్ర రాజకీయాల్లో
చర్చనీయాంశమైంది. సిద్ధరామయ్య సైతం తన విగ్రహాన్ని డీకే ఆవిష్కరించడంపట్ల హర్షం వ్యక్తంచేశారు. ఇది తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీ సమష్టి కృషికి దక్కిన గుర్తింపని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం పదవి రేసులో పోటీపడుతున్న ఈ ఇద్దరు ఇలాంటి ఐక్యతను చూపడం
రాష్ట్ర రాజకీయాలకు కొత్త సంకేతంగా మారింది.