న్యూఢిల్లీ : కరోనా తగ్గుముఖం పట్టడంతో దీపావళి పండుగను హుషారుగా జరుపుకున్నారు. దీపావళి పండుగను గొప్పగా జరుపుకున్నారని చెప్పడానికి ఈ లావాదేవీలే నిదర్శనమని చెప్పొచ్చు. ఈ ఏడాది దీపావళి పండుగకు జరిగిన వ్యాపార విక్రయాలు రూ. 1.25 లక్షల కోట్లు దాటినట్లు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) తెలిపింది. గత పదేండ్లలో ఇంత రాబడి రాలేదని పేర్కొన్నది. పదేండ్ల తర్వాత రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని స్పష్టం చేసింది. దీంతో గత రెండేండ్లుగా మందకొడిగా సాగిన వ్యాపార విక్రయాలకు తెరపడింది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే వివాహాల సీజన్కు వ్యాపారులు తమ విక్రయాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా దేశం మొత్తం మీద సుమారు రూ. 1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందన్నారు. గత పదేండ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగిందని తెలిపారు. ఒక్క ఢిల్లీలోనే రూ. 25 వేల కోట్ల వ్యాపారం జరిగిందన్నారు.
ఈ దీపావళికి చైనా ఉత్పత్తులు విక్రయించలేదని, స్వదేశీ ఉత్పత్తులపైనే వినియోగదారులు దృష్టి సారించారని పేర్కొన్నారు. సాంప్రదాయ వస్తువులైన మట్టి దీపాలు, దీపాల రంగుల అలంకరణ, మట్టి బొమ్మలు, కొవ్వొత్తులకు డిమాండ్ పెరిగిందన్నారు. దీంతో కుమ్మరులు, హస్త కళాకారులకు మంచి డిమాండ్ వచ్చిందన్నారు. వారి వ్యాపారం గణనీయంగా పెరిగిందని తెలిపారు. మరోవైపు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, ఎల్ఈడీ బల్బులు, గృహాలంకరణ తదితర వస్తువులకు కూడా విపరీతమైన గిరాకీ ఏర్పడిందన్నారు.