ముంబై: మహారాష్ట్ర అధికార భాష మరాఠీలోనే సైన్ బోర్డులు ఉండాలన్న డిమాండ్ ఊపందుకున్నది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ మేరకు ఒక ఉత్తర్వును స్కూళ్లకు జారీ చేసింది. అన్ని పాఠశాలల పేర్లు మరాఠీలోనే ఉండాలని పేర్కొంది. మరాఠీ దేవనగరిలో రాసిన పేర్లతో కూడిన నిర్ణీత సైజులోని సైన్ బోర్డులను స్కూళ్ల బయట ఏర్పాటు చేయాలని బీఎంసీ విద్యాశాఖ ఆదేశించింది. బీఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.
కాగా, ఇటీవల ముంబై యూనివర్సిటీ అనుబంధ కాలేజీలకు కూడా ఇలాంటి నిబంధన జారీ చేశారు. కాలేజీ పేర్లు మరాఠీలో ఉండాలని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని స్థానిక భాష మరాఠీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికార శివసేన యూత్ వింగ్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నది. స్కూళ్లు, కాలేజీల పేర్లను సూచించే సైన్ బోర్డులు మరాఠీ భాషాలో ఉండేలా చర్యలు చేపట్టాలంటూ ఆయా విద్యా బోర్డులకు లేఖలు రాసింది.