Karnataka | బెంగళూరు, జూలై 25: కర్ణాటకలో బీజేపీ అవినీతితో విసిగివేసారిన ప్రజలు అధికారం అప్పగిస్తే.. దాన్ని నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్ నానాపాట్లు పడుతున్నది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్రలు చేస్తున్నాయంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోమవారం ఆరోపించగా.. తర్వాతి రోజునే నియోజకవర్గాల్లో పనులు కావడం లేదని, మంత్రులు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. 11 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. నియోజకవర్గాల్లో పనులు కావడం లేదని, 20 మందికి పైగా మంత్రులు అసలు స్పందించడం లేదని, ఈ వ్యవహారంపై వెంటనే జోక్యం చేసుకోవాలని వారు కోరారు.
ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నామని, అధికారులు ఎవరూ తమ మాట వినడం లేదంటూ ఎమ్మెల్యేలు ఏకరవు పెట్టారు. దీని ద్వారా అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు, పరస్పర ఫిర్యాదుల సంస్కృతికి పేరొందిన కాంగ్రెస్ నైజం మరోసారి బట్టబయలైనట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం కూల్చివేత పరిణామాలు జరుగుతున్నట్టు తనకేమీ తెలియదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. దీనిపై ఆయననే(శివకుమార్) అడుగుతామని అన్నారు. అయితే పార్టీలో అసంతృప్తి లేదని, ఎలాంటి ఫిర్యాదులు రాలేదని సర్దిపుచ్చే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్ సీఎంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన.. ‘ఓ వ్యక్తిని సీఎం ఎలా చేయాలో, సీఎం కుర్చీ నుంచి ఎలా దించాలో’ తనకు తెలుసునని అన్నారు. ఉడుపి జిల్లాకు నిధులు కేటాయింపులో సిద్ధరామయ్య విఫలమయ్యారని ఆరోపించారు.