Shyam Benegal | ముంబై/హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ) : ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ సోమవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న 90 సంవత్సరాల శ్యామ్ బెనెగల్ సోమవారం సాయంత్రం ముంబైలోని వోడ్హార్డ్ దవాఖానలో తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమార్తె పియా బెనెగల్ ధ్రువీకరించారు. ఆయనకు భార్య నీనా బెనెగల్, కుమార్తె ఉన్నారు. అంకుర్, భూమిక, జునూన్, కలియుగ్, ఆరోహన్, త్రికాల్, సుస్మాన్, అంతర్నాద్, మండి, మంథన్ తదితర అనేక అవార్డు చిత్రాలకు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. 1978లో వాణిశ్రీ, అనంతనాగ్లతో ఆయన తీసిన ఏకైక తెలుగు చిత్రం అనుగ్రహం 1979 బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు నోచుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డిసెంబర్ 14న ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులతో కలసి తన 90వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డు, 1991లో పద్మ భూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ఆయన దర్శకత్వం వహించిన విజయవంతమైన చిత్రాలలో మంథన్, జుబేదా, సర్దారీ బేగం కూడా ఉన్నాయి.
జవహర్లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా దూరదర్శన్ కోసం ఆయన రూపొందించిన భారత్ ఏక్ ఖోజ్ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనెగల్ కొంకణీ మాట్లాడే చిత్రపూర్ సారస్వత్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. కర్ణాటకకు చెందిన శ్యామ్ బెనెగల్ తండ్రి శ్రీధర్ బీ బెనెగల్ ఫొటోగ్రాఫర్ కావడంతో కెమెరా పట్ల శ్యామ్కు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. తన 12వ ఏట తన తండ్రి బహుమతిగా ఇచ్చిన కెమెరాతో శ్యామ్ బెనెగల్ తన మొదటి చిత్రాన్ని తీశారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆయన హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించి తన సినీ ప్రయాణానికి బాటలు వేసుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో అంకుర్, మంథన్, మండి, నేతాజీ సుభాష్ చంద్ర బోస్: ది ఫర్గాటెన్ హీరో, జుబేదా, వల్ డన్ అబ్బా వంటివి అంతర్జాతీయంగా పేరు గడించాయి. ఆయన దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. తన 90వ జన్మదినానికి ముందు బెనెగల్ మాట్లాడుతూ తాను మూడు, నాలుగు ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నానని చెప్పడం విశేషం.
బెనెగల్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సినీ ప్రముఖులు శేఖర్ కపూర్, హన్సల్ మెహతా, మనోజ్ బాజ్పాయి, అక్షయ్ కుమార్, కాజోల్ సంతాపం వ్యక్తం చేశారు. అద్భుతమైన దర్శకులు, మేధావులలో ఒకరైన శ్యామ్ బెనెగల్ మృతి తనను తీవ్రంగా బాధించిందని ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి సంతాపం ప్రకటించారు.
‘దిగ్గజ దర్శకుడు, తెలంగాణ మట్టిబిడ్డ శ్యామ్ బెనగాల్ మృతి తీవ్రంగా బాధించింది. దాదాసాహేబ్ ఫాల్కే, పద్మభూషణ్ అవార్డులను అందుకున్న శ్యామ్ బెనెగల్.. తన మొదటి చిత్రం అంకుర్ ద్వారా తెలంగాణలోని భూస్వా మ్య వ్యవస్థను కళ్లకు కట్టారు. భావితరాలకు ఆయన స్ఫూర్తి’