ముంబై: బాలీవుడ్కు చెందిన అలనాటి నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఆయన సతీమణి సైరా బాను తెలిపారు. శ్వాససంబంధ సమస్యతో దిలీప్ కుమార్ (98) జూన్ 30న ముంబైలోని హిందూజ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైరా బాను దిలీప్కుమార్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఓ జాతీయ మీడియా సంస్థకు వెల్లడించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఇప్పటికీ ఆయన ఐసీయూలోనే ఉన్నారని, డాక్టర్లు డిశ్చార్జి చేస్తే ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఈ రోజు డిశ్చార్జి చేసే అవకాశాలు లేవని సైరా బాను చెప్పారు. కాగా, శ్వాస సమస్యతో దిలీప్ కుమార్ ఆస్పత్రిలో చేరడం జూన్ నెలలో ఇది రెండోసారి. జూన్ 6న కూడా ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జి చేశారు.