న్యూఢిల్లీ, మే 27: కొత్త ఐటీ నిబంధనల గురించి వాట్సాప్, సోషల్ మీడియా వినియోగదారులు భయపడాల్సిన అవసరమే లేదని కేంద్ర సమాచార మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే కొత్త నిబంధనలను తీసుకువచ్చామని చెప్పారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, దేశ భద్రత, శాంతి భద్రతలు, లైంగికదాడుల వంటి నేరాల్లో మాత్రమే వాట్సాప్ నుంచి ప్రభుత్వం వివరాలు కోరుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ నిబంధనలపపై ఓటీటీ, డిజిటల్ న్యూస్ సంస్థలు తమ నిర్ణయాన్ని తెలుపాలని కేంద్ర సమాచార శాఖ ఆదేశించింది. అందుకు సంబంధించిన వివరాలను 15 రోజుల్లోగా సమర్పించాలని గురువారం స్పష్టం చేసింది. కొత్త ఐటీ రూల్స్ నుంచి సంప్రదాయ టీవీ న్యూస్, న్యూస్ చానళ్లు వాటికి సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫారాలను మినహాయించాలని న్యూస్ బ్రాడ్క్యాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) గురువారం కేంద్రప్రభుత్వాన్ని కోరింది. ఇవి ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం తగినంత నియంత్రణలో ఉన్నాయని, కొత్తగా నియంత్రణ అక్కర్లేదని పేర్కొన్నది.