న్యూఢిల్లీ: అధికారులు నా బిడ్డను చూపిస్తామని ఇంటి నుంచి తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారని, నేను నా బిడ్డను చూడాలి అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని ఉత్తరాఖండ్ రిసార్టులో హత్యకు గురైన 19 ఏండ్ల రిసెప్షనిస్ట్ అంకితాభండారీ తల్లి ఆవేదన వ్యక్తంచేశారు. నా బిడ్డ అంత్యక్రియలను ఆగమాగం చేశారని, కడసారి చూపు కూడా చూసుకోనివ్వలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
అంకితా భండారి హత్య కేసు విచారణలో పోలీసులు తాత్సారం చేస్తున్నారంటూ ఒకవైపు జనం ఆందోళన, ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం నిందితులకు కొమ్ముకాస్తున్నదంటూ మరోవైపు బాధితురాలి కుటుంబసభ్యుల ఆరోపణల నడుమ అధికారులు ఆదివారం సాయంత్రం ఆగమేఘాల మీద అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో మృతురాలి తల్లి కనిపించకపోవడంతో ఆమె ఆరోగ్యం బాగాలేదని వార్తలు వచ్చాయి.
కానీ, తాజాగా ఆ వార్తలను అంకితా భండారి తల్లి కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, అధికారులు నన్ను నా బిడ్డ దగ్గరకు తీసుకెళ్తున్నామని చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లారని, చివరిచూపు చూసుకోకుండా మోసం చేశారని ఆరోపించారు. అంతకుముందు కేసు విచారణలో ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఆందోళనకారులు, బాధితురాలి కుటుంబం అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుపడ్డారు.
ఉత్తరాఖండ్లోని పౌరి జిల్లాలోగల ఓ రిసార్టులో అంకితాభండారి హత్యకు గురయ్యారు. రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా కలిసి అమెను హత్యచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పుల్కిత్ తండ్రి, సీనియర్ బీజేపీ నేత వినోద్ ఆర్యను ఆ పార్టీ నుంచి తొలిగించారు.