Ketan murder Case : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య కేసులో పోలీసులు దిగ్భ్రాంతి కలిగించే విషయాలను వెల్లడించారు. తన కాబోయే భర్త కేతన్ను లోహ్గఢ్ కోట (Logharh Fort) పై నుంచి లోయలోకి తోసి చంపిన కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ (Siya Goyel).. ఈ దారుణానికి ఒడిగట్టడానికి ముందు పక్కా స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో తేలింది. గతంలో దేశాన్ని కుదిపేసిన మేఘాలయ హనీమూన్ హత్య (Honeymoon Murder) కేసు నిందితురాలు సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) చేసిన తప్పులను తను కూడా చేయకుండా సియా పాఠాలు నేర్చుకుందని, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తీవ్రంగా రిసెర్చ్ చేసిందని పుణె పోలీసులు తెలిపారు.
గతంలో సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని హనీమూన్ నెపంతో మేఘాలయకు తీసుకెళ్లి సోహ్రా జలపాతం సమీపంలో తన ప్రియుడితో కలిసి ఆయుధాలతో దాడికి పాల్పడి హత్య చేసింది. అయితే ఆయుధాలు వాడటంవల్ల శరీరంపై గాయాలయ్యాయని, అదే పోలీసులకు కీలక ఆధారంగా మారి సోనమ్ అరెస్ట్కు దారితీసిందని సియా గోయల్ గుర్తించింది. సోనమ్ చేసిన ఈ తప్పును తాను పునరావృతం చేయకూడదని సియా భావించింది. అందుకే ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా కేతన్ను లోహ్గఢ్ కోటపై నుంచి కిందకు నెట్టేయడం ద్వారా దీన్ని ఒక ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించాలని ప్లాన్ చేసింది.
ఒంటరిగా నెట్టడం సాధ్యం కాకపోవచ్చని భావించి, తన ప్రియుడు చేతన్ చౌదరి సాయం తీసుకుందని పోలీసులు నిర్ధారించారు. నిందితురాలి మొబైల్ ఫోన్ను డిజిటల్ ఫొరెన్సిక్ విశ్లేషణ చేయగా మరిన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సియా గోయల్ తన ఫోన్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీలో సోనమ్ రఘువంశీ కేసు వివరాలను క్షుణ్ణంగా శోధించినట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. అంతేకాకుండా “పోలీసు కస్టడీలో మహిళా ఖైదీలను కొడతారా..?”, “మహిళా ఖైదీలకు చట్టపరంగా ఉన్న హక్కులు ఏమిటి..?” వంటి అంశాలపై కూడా ఆమె ముందస్తుగానే గూగుల్లో విస్తృతంగా వెతికినట్లు పోలీసులు గుర్తించారు.
కేతన్ పడిపోయిన ప్రదేశం మరీ లోతైనది కాకపోవడం, కుటుంబసభ్యుల అనుమానాలు, పోలీసుల సుదీర్ఘ విచారణతో చివరకు ఈ జంట గుట్టు రట్టయింది. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ న్యాయస్థాన ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.