న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: అత ని పేరు ధనిరామ్ మిట్టల్. పోలీస్ రికార్డుల్లో మాత్రం సూపర్ నట్వర్లాల్, ఇండియన్ చార్లెస్ శోభరాజ్ అని పేర్కొంటారు. భారతదేశంలోని అత్యంత తెలివైన నేరస్థుడిగా పేరుగాంచాడు. మిట్టల్ చదువు సంధ్యలు అబ్బక అల్లరిచిల్లరిగా తిరిగి దొంగతనాలకు అలవాటు పడ్డాడనుకుంటే పొరపాటు. ఇతను లా డిగ్రీ చదివాడు. అంతేకాదు హ్యాండ్ రైటింగ్లో స్పెషలిస్ట్.. గ్రాఫాలజిస్ట్.. ఇలా ఎన్నో విద్యార్హతలున్న ధనిరామ్ మిట్టల్ దొంగతనాన్ని జీవనోపాధిగా ఎంచుకోవడం గమనార్హం. సుమారు ఆరు దశాబ్దాల కాలంలో రికార్డు స్థాయిలో అరెస్టు అవ్వటమే కాదు.. వెయ్యికి పైగా కార్లను దొంగతనం చేసిన రికార్డు కూడా సృష్టించాడు. ప్రధానంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టపగలు కార్లను దొంగలించడం ఇతని స్పెషాలిటీ.
ఇతని మరో స్పెషాలిటీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తప్పుడు పత్రాలను సృష్టించి అదనపు సెషన్స్ జడ్జి స్థానంలో జడ్జి అవతారమెత్తి 2 వేల మంది నేరస్తులను విడిపించాడు. ఏం జరుగుతుందో పోలీసులకు అర్థమయ్యేలోగా అక్కడి నుంచి మిట్టల్ మాయమయ్యా డు. విషయం తెలుసుకున్నాక అతను విడిపించిన నేరస్తులందరినీ మళ్లీ కటకటాల వెనక్కి నెట్టారనుకోండి. స్వయంగా న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన ధనిరామ్ మిట్టల్ తన నేరపూరిత చర్యలకు ముందు 1968 నుంచి 1974 వరకు నకిలీ పత్రాలనుపయోగించి స్టేషన్ మాస్టర్గా కూడా పనిచేశాడు. మంగళవారం ఢిల్లీలోని పశ్చిమ విహార్లో అరెస్ట్ తర్వాత మిట్టల్ మరోసారి వార్తల్లోకెక్కాడు. షాలీమార్ బాగ్లో దొంగతనం చేసిన మారుతీ ఎస్టీమ్ కారును స్క్రాప్ డీలర్కు విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. మే 4న జైలు నుంచి విడుదలైన తర్వాత అతను చేసిన రెండో కారు దొంగతనం ఇది. ఇంతకంటే ముందు మార్చి నెలలో మిట్టల్ను ఒకసారి అరెస్ట్ చేశారు.