బెంగళూరు : పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) డైరెక్టర్ రవీందర్ సింగ్ జమ్వాల్ నకిలీ మాస్టర్స్ డిగ్రీతో అంచెలంచెలుగా ఎదిగిపోయారు. ఈ విషయం బయటపడినప్పటికీ, ఆయన ఆ పదవిలో కొనసాగుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనినిబట్టి ఆయనకు ఏ స్థాయిలో పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, సిక్కింలోని ఈఐఐఎల్ఎం విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ (ఫిజిక్స్) చేసినట్లు ఆయన నకిలీ సర్టిఫికేట్ను సమర్పించినట్లు డీజీసీఏలోని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కార్యాలయానికి 2023 డిసెంబరు 1న ఫిర్యాదు అందింది. దీంతో అదే నెల 5న ఆ విశ్వవిద్యాలయానికి లేఖ రాశారు. రవీందర్ పేర్కొన్న డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదని, ఆ సర్టిఫికేట్ బూటకమని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.
ఇదే విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖలోని నావికా దళం విభాగానికి తెలియజేశారు. అయినప్పటికీ జమ్వాల్ తన విధులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన 11 సంవత్సరాలపాటు గోవాలోని ఐఎన్ఎస్ హంస డబోలిమ్ విమానాశ్రయంలో నావల్ ఏటీసీగా పని చేశారు. ఆ తర్వాత రిలయన్స్ కమర్షియల్ డీలర్స్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్)గా పని చేశారు. 2012 అక్టోబరులో డీజీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా చేరారు. యూపీఎస్సీ పరీక్షల ద్వారా 2016 మార్చిలో డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా సెలెక్ట్ అయ్యారు. 2021లో డీజీసీఏ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఎయిర్ స్పేస్ అండ్ ఎయిర్ నేవిగేషన్ సర్వీసెస్ స్టాండర్డ్స్, ఫ్లైట్ స్టాండర్డ్స్ డైరెక్టరేట్ అధిపతిగా ఉన్నారు.