కొత్త ఏడాది తొలిరోజు భగవంతుడి ఆశీర్వాదం తీసుకుంటే ఏడాదంతా మంచే జరుగుతుందన్న ఆశతో జనం ఆలయాలకు పోటెత్తారు. శనివారం అర్ధరాత్రి వరకు వేచిచూసి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు.. ఆదివారం తెల్లవారుజాము నుంచే దైవానికి పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి మనసారా మొక్కుకోవడం మొదలుపెట్టారు. దాంతో దేశంలోని అన్ని ఆలయాలు, ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వివిధ ఘాట్లలో హారతి కార్యక్రమాలు, ఆలయాల్లో పూజలతో దేశమంతా ఆధ్యాత్మిక కళను సంతరించుకున్నది. ఆలయాలకు వచ్చిపోయే భక్తులతో వివిధ నగరాల్లోని వీధులు కళకళలాడాయి.
వారణాసి, ఉజ్జయినిలో..
సిటీ ఆఫ్ ఘాట్స్గా పేరొందిన వారణాసిలో.. గంగా హారతి ద్వారా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అస్సీ ఘాట్లో స్థానిక పూజారులు తెల్లవారుజామునే గంగా హారతి నిర్వహించారు. ఈ హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అదేవిధంగా ఉజ్జయినీ మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మ హారతి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి శివుడి కోసం చేసే భస్మ హారతిని తిలకించారు.
సిద్ధి వినాయక, పూరీ జగన్నాథ ఆలయాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జందేవాలన్ ఆలయంలో కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలోని సిద్ధి వినాయక ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. అక్కడ నిర్వహించిన హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పూరీ బీచ్లో సూర్యోదయాన్ని వీక్షించేందుకు కూడా భక్తులు భారీగా అక్కడికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు చేసి, సూర్యభగవానునికి నమస్కరించి అనంతరం పూరీ జగన్నాథుని దర్శనం చేసుకున్నారు. దాంతో పూరీ జగన్నాథాలయం భక్తులతో కిటకిటలాడింది.
గోల్డెన్ టెంపుల్లో.. చర్చిల్లో..
పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ (శ్రీ హర్మందిర్ సాహిబ్)లు కూడా నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక ప్రార్థనలతో మార్మోగింది. మరోవైపు చెన్నై నగరంలోని అన్నానగర్లోగల సెయింట్ లూక్ చర్చిలో, కోయింబత్తూరులోని ఇన్ఫాంట్ జీసస్ చర్చిలో కూడా కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.