న్యూఢిల్లీ/పథనంతిట్ట, నవంబర్ 22: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి విమానాల్లో వెళ్లే భక్తులకు శుభవార్త. ఇరుముడి (నెయ్యితో నింపిన టెంకాయ, ఇతర పూజాసామగ్రి)ని భక్తులు విమాన క్యాబిన్ బ్యాగేజీల్లో తమ వెంట తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) తాత్కాలికంగా అనుమతించింది. ప్రస్తుత శబరిమల యాత్ర సీజన్కు సంబంధించిన మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే జనవరి 20వ తేదీ వరకు మాత్రమే ఈ అనుమతి ఉంటుందని అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ మేరకు ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్(ఏఎస్జీ) అదనపు భద్రతా చర్యలు, చెకింగ్ చేపడతుతుందని బీసీఏఎస్ మంగళవారం తెలిపింది.
కొవిడ్ ఆంక్షల ఎత్తివేత నేపథ్యంలో శబరిమలకు అయ్యప్ప భక్తుల తాకిడి పెరిగింది. దీంతో ఆలయ అధికారులు దర్శన సమయాల్లో మార్పులు చేశారు. రెండో విడత దర్శన సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటలకు మార్చారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించేవారు. రెండు నెలల పాటు జరిగే భక్తుల శబరిమల యాత్ర నిమిత్తం అయ్యప్ప ఆలయాన్ని ఈనెల 16న తెరిచిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి 3 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకొన్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.