ముంబయి : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్స్టేషన్లో హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్పై నమోదైన కేసులో ఫడ్నవీస్ సాక్షి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఫడ్నవీస్ ఒక సాక్షి అని, గతంలో ఆయన వాంగ్మూలం రికార్డు చేసినట్లు రాష్ట్రం తరఫున హాజరైన స్పెషల్ ప్రాసిక్యూటర్ అజయ్ మిసార్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం ఫైర్ అయ్యారు. కేసును నీరుగార్చాలని చూస్తుందని, స్కామ్స్టర్లను కాపాడాలనుకుంటోందని, దీన్ని బహిర్గతం చేసిన పోలీస్స్టేషన్కు పిలుస్తోందని ఫడ్నవీస్ పేర్కొన్నారు. కేసును ముగింపునకు తీసుకువచ్చేందుకు ఫడ్నవీస్ పోలీసులకు సహకరించాలని శివసేన సూచించింది. పోలీసులు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని ఆ పార్టీ ప్రతినిధి మనీషా కయాండే పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు రాష్ట్రం ఎలాంటి ఏజెన్సీలను వినియోగించుకోవడం లేదని, ఇది కేంద్రం వ్యూహమని పేర్కొన్నారు.