ముంబై: మహారాష్ట్ర రాజకీయ మలుపులకు కీలకమైన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, చివరకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్తో దిగివచ్చారు. ఆయన మాటకు గౌరవం ఇచ్చి డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేలా చేసి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం పడిపోయేందుకు తెరవెనుక చక్రం తిప్పిన దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో కంగుతున్నారు. మరోసారి సీఎం కావచ్చని ఆయన ఆశ పడగా, ఆ పోస్ట్ను షిండేకు బీజేపీ ఆఫర్ చేసింది. పార్టీ నిర్ణయంతో షాకైన ఫడ్నవీస్, షిండేను సీఎంగా తన నోటితోనే ప్రకటించారు. అయితే షిండే ప్రభుత్వంలో తాను ఉండనంటూ ఆ సందర్భంగా మీడియాతో అన్నారు.
కాగా, మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో కీలకంగా వ్యవహరించిన ఫడ్నవీస్ సొంతంగా తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ అధిష్ఠానం కూడా షాక్ అయ్యింది. ప్రభుత్వంలో ఆయన లేకపోతే బీజేపీకి కంట్రోల్ ఉండదని భావించింది. దీంతో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టాలని ఫడ్నవీస్పై బీజేపీ ఒత్తిడి తెచ్చిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్లు చేశారని చెప్పారు. అయినప్పటికీ ఫడ్నవీస్ సుముఖంగా లేకపోవడంతో చివరకు ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి ఆయనకు రెండు సార్లు ఫోన్ చేశారని వివరించారు. దీంతో మోదీ ఫోన్ కాల్స్కు గౌరవం ఇచ్చిన ఫడ్నవీస్ చివరకు డిప్యూటీ సీఎం పోస్ట్కు అంగీకరించారని బీజేపీ వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడించాయి.