ముంబై : కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై కేసు నమోదు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేండ్లయిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు తాను చెంపదెబ్బతో సమాధానం ఇచ్చేవాడినని రాణే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. రాణే అరెస్ట్కు రంగం సిద్ధం చేయడంతో మహావికాస్ అఘడి ప్రభుత్వాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ ఖాకీ సర్కార్గా అభివర్ణించారు.
ఠాక్రేపై రాణే చేసిన ప్రకటనను వ్యక్తిగతంగా తాను సమర్ధించడం లేదని అయితే పార్టీ ఆయన వెన్నంటి నిలిచిందని చెప్పారు. షర్జిల్ ఉస్మానీ భారత మాతను అవమానపరిచినా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, కేంద్ర మంత్రి రాణేపై మాత్రం మహారాష్ట్ర సర్కార్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని దుయ్యబట్టారు. మహా సర్కార్ ఖాకీల అండతో హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ఇక రాణేను తక్షణమే అరెస్ట్ చేయాలని నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే ఉత్తర్వులు జారీ చేయగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని రాణే బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు.