IMD | న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా జూన్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జూలై నెలపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రైతన్నలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించింది. దేశంలో జూలైలోనూ సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించింది. కానీ జూన్తో పోలిస్తే జూలైలో దేశవ్యాప్తంగా వర్షపాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఎన్నినో ప్రభావంతో జూలైలో పరిస్థితుల్లో మార్పులు వస్తాయని ఐఎండీ వెల్లడించింది. న్యూఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడారు.
జూన్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిశాయని, కానీ జూలైలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. ఈ నెలలో 94 నుంచి 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని వివరించారు. జూన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో కొంత వరకు జూలైలో కురిసే వానల వల్ల తుడిచిపెట్టుకుపోతాయని పేర్కొన్నారు. 1971-2020 వరకు జూలైలో నమోదైన వర్షపాతాలను విశ్లేషించి దీనిపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, ఈశాన్య రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దేశంలోని 16 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జూన్లో తక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. బీహార్లో 69, కేరళలో 60 శాతం సాధారణం కంటే తక్కువ నమోదు అయిందన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గత 25 ఏండ్లలో 16 ఏండ్లపాటు జూన్లో తక్కువ వర్షపాతమే ఉందన్నారు. దేశంలోని 377 ప్రాంతాల్లో భారీ వర్షాలు (204.5 మిల్లిమీటర్లు), 62 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు (204.5 మిల్లిమీటర్లకి మించి) కురిశాయని తెలిపారు.