న్యూఢిల్లీ : కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) రికార్డు స్ధాయిలో ఉత్పత్తి చేపట్టినా బొగ్గు కొరతతో భారత్ ఇంధన సంక్షోభం దిశగా ఎందుకు పయనిస్తోందనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద బొగ్గు సరఫరాదారు సీఐఎల్ ఈ ఏడాది ప్రధమార్ధంలో రికార్డుస్ధాయిలో బొగ్గును ఉత్పత్తి చేసింది. ఏప్రిల్-సెప్టెంబర్లో సీఐఎల్ దాదాపు 250 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఉత్పత్తి కంటే 13.8 మిలియన్ టన్నులు అధికం కావడం గమనార్హం.
అయితే డిమాండ్ అధికంగా ఉండటంతోనే ప్రస్తుత పరిస్ధితికి దారితీసిందని సీఐఎల్, బొగ్గు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమ నిపుణులు ఊహించిన దానికంటే అధికంగా ఆర్ధిక కార్యకలాపాల పునరుద్ధరణ ముమ్మరంగా ఉండటం కూడా ప్రస్తుత పరిస్ధితికి కారణమని ఇది ఓ రకంగా సానుకూలాంశమేనని చెబుతున్నారు. ఇక రుతుపవనాల సీజన్లో భారత్కు దిగుమతులు జాప్యం కావడం వంటి కారణాలూ ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు దిగుమతి చేసుకునే బొగ్గుపై ఆధారపడే విద్యుత్ ప్లాంట్లు అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలతో తమ బొగ్గు సరఫరాల కోసం సీఐఎల్ను ఆశ్రయించడంతో కూడా బొగ్గుకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. విద్యుత్ డిమాండ్ ఊపందుకోవడం కూడా ప్రస్తుత దుస్ధితికి కారణమని, అయితే పరిశ్రమ వేగంగా కోలుకోవడం సానుకూల పరిణామమేనని అధికారులు చెబుతున్నారు. ఇక బొగ్గు కొరతతో ఇంధన సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు.