న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతోపాటు ఉత్తరభారతదేశాన్ని మంచు దుప్పటి (Dense Fog) కమ్మేసింది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విజబిలిటి పడిపోవడంతో రోడ్డుపై వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొన్నది. కాగా, రెండువారాల సెలవుల అనంతరం నేడు పాఠశాలలు తెరచుకోనున్నాయి. అయితే చల్లటి వాతావారణం కారణంగా స్కూళ్ల పనివేళలను ప్రభుత్వం కుదించింది.
పొగమంచు భారీగా కురుస్తుండటంతో విజిబిలిటీ పడిపోయింది. ఈనేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్టుకు రావాల్సిన సుమారు 110 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 79 విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులను ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు అలర్ట్ చేశాయి. దట్టమైన మంచువల్ల తాము ప్రయాణించాల్సిన విమానాల కోసం ప్రయాణికులు వేచిచూడాలని, వివరాలకోసం విమానయాన సంస్థలను సంప్రథించాలని సూచించారు. ఢిల్లీ, కోల్కతాలో వాతావరణ పరిస్థితుల వల్ల ఇండిగో, స్పైస్జెట్, విస్తారా విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది.